Tuesday, February 15, 2011

SAVE INDIA




భారతదేశం గొప్ప సంపన్నదేశం. అందుకే శతాబ్దాలుగా ఇది దోపిడీకి గురవుతోంది. ఇక్కడి ప్రజలు కూడా శాంతి కాముకులే. ఇక్కడి ప్రజలకు పరమత సహనం, ప్రేమ, ఆప్యాయతలు కూడా ఎక్కువే. అందుకే ఎక్కడివాడో వచ్చి మనల్ని నిలువునా దోచుకుంటున్నాడు. ఇలా ఎంత కాలం? మనం ఎప్పుడూ ఇలా నష్టపోవాల్సిందేనా? ఈ దోపిడీ రాజ్యం ఆంగ్లేయులతోనే అంతరించి పోతుందని ఆశపడినా... లాభం లేకుండా పోయింది.

ఇంగ్లీషోల్లు మిగిల్చింది ఊడ్చేయడానికి మన నల్లదొరలు బతికే ఉండటం మనం చేసుకున్న పాపం. గాంధీజీ కలలుగన్న శ్రీరామరాజ్యం కల్లలుగానే ఉండిపోయింది. రాజకీయ వ్యవస్థ దగ్గర్నుంచి శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయి. వారికి మీడియా కూడా వంతపాడుతోంది. అందుకే ఇండియా ఇలా దాపురించింది.

అప్పట్లో చిన్నపాటి అవినీతి జరిగితే- ఎంతో నిరసన వ్యక్తమయ్యేది. ఇపుడు వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు కాదు... ఏకంగా వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు మేస్తున్నారు. దేశాన్ని ఏలుతున్న వారే- దేశసంపదను కొల్లగొడుతుంటే- మనం నిశ్చేష్ఠులై ఉండిపోతున్నాం. ఎందుకిలా జరుగుతోంది. ఎంతకాలం ఇలా భరించాలి. అధికారం ఉన్నోడు- దొరలా దోచుకోవాల్సిందేనా? పేదరికంలో మగ్గినోడు- పాపర్‌గా మిగిలిపోవాల్సిందేనా?

ఇంకెన్నాళ్లు... ఈ దోపిడీ రాజ్యం... ఇంకెన్నాళ్లు భరించాలి... ఈ దోపిడీదొంగల్ని. మనం ఉప్పు కారం తినట్లేదా? మనలో చేవ తగ్గిపోతోందా? మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐ.ఎ.ఎస్‌.లు, ఐ.పి.ఎస్‌.లు, న్యాయాధికారులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి అడ్డులేదా? ఇకనైనా మనం ఈజిప్టు సోదరులనుంచి ఏమైనా నేర్చుకుంటామా? హే రామ్‌! నా దేశాన్ని రక్షించు... ఈ రాబందుల నుంచి... ఈ దోపిడీగాళ్ల నుంచి... SAVE INDIA.

0 comments:

Post a Comment