Saturday, April 23, 2011

HEY BHAGAVAN







భగవాన్‌... సత్య సాయిబాబా...ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం. ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు, చేసిన ఆధ్యాత్మిక భోదనలు అనన్య సామాన్యమైనవి. ఆయన నిర్యాణం చెందారన్న వార్త భక్తులనే కాదు యావత్‌ మానవాళిని కదిలించేసింది. ఎందుకంటే- ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అటువంటివి. ఉన్నత విద్య, సూపర్‌ స్పెషాలిటీ వైద్యం, మంచినీటి సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం ఆయనకే సాధ్యమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో గురువులు, మహిమాన్విత వ్యక్తులు ఉన్నారు. కానీ ఎవ్వరూ చేయని విధంగా,  ఈ సాయి చేయడం విశేషం. అందుకే నాకు విశ్వాసం లేకున్నా... ఆయన సేవాభావాన్ని ప్రేమించాను.


ఆయన మహిమల గురించి వినిపించే విమర్శలను నేను పట్టించుకోను... ఎందుకంటే- ఆయన సేవా కార్యక్రమాల ముందు- ఈ విమర్శలు నిలబడవు కాబట్టి. చివరకు బీబీసీ మీడియా కూడా బాబాను అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నించింది. నిత్యం తనను దర్శించుకునే భక్తులకు బాబా ప్రముఖంగా అయిదు సూత్రాలు భోదించారు. అవి- ప్రేమ, శాంతి, ధర్మం, సత్యం, అహింస... నిజంగా ఈ పదాలు వింటేనే నా మనసు పులకించిపోతుంది. వీటినే ఆధారంగా చేసుకుంటే మానవుని జీవితం ధన్యమవుతుందని బాబా చెప్పారు.


ఆయన భోదనల్లో నాకు నచ్చిన ప్రవచనం... నేను దేవుడిని, నీవు కూడా దేవుడివే, తేడా ఏమిటంటే, ఈ సంగతి నాకు తెలుసు, నీకు అసలు తెలియదు.

Saturday, April 2, 2011

SALUTE TO MEN IN BLUE



యస్‌... ఇండియా రాక్స్‌... ఈ పదాలు రాస్తుంటే నా శరీరం పులకిస్తుంది. నా మనసు పరవశిస్తుంది. నా శ్వాస జయహో అంటోంది. అవును. ఎన్నాళ్లకెన్నాళ్లకు మన క్రికెట్‌ వీరులు మళ్లీ జగజ్జేతలయ్యారు. ఫైనల్లో మనం గెలుస్తామని నాకు ఎంతో ధీమా ఉంది. ఎందుకంటే- బ్యాటింగ్‌లో అద్భుతమైన ఆటతీరును కనబరుస్తున్న మన  ఆటగాళ్లు...నాకౌట్‌లోకి ప్రవేశించేసరికి జగదేకవీరుడి వలె ప్రత్యర్థిని చిత్తుచేశారు. బౌలర్లు చెలరేగితే, ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా జారారు. మనవాళ్లు పులిలా వేటాడుతుంటే ప్రత్యర్థులు జింక పిల్లల్లా చెల్లాచెదురయ్యారు. ఫైనల్‌ ప్రత్యర్థి శ్రీలంక మనతో సమఉజ్జీగా నిలిచే జట్టే కానీ, 275 పరుగుల విజయలక్ష్యం మనవారికి చాలా చిన్నది. ఎందుకంటే- పిచ్‌లో బౌలర్లకు పెద్దగా ఏమీ లేదు. కాబట్టే నేను ధీమాగా ఉన్నాను. అందరికీ ఇండియాదే ట్రోఫీ అని చెప్పాను. అదే నిజమైంది. ఆ తర్వాత భారతావని జనసంద్రంగా మారింది. అందరూ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. బాణాసంచా కాల్చారు. మా ఇంట్లోనూ పిల్లలు దీపావళి జరిపారు.






ఇవన్నీ చూస్తుంటే నాకు చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. 1983 జూన్‌ 25వ తేదీ నాకు బాగా గుర్తు. కలర్‌ టీవీలు అప్పుడప్పుడే వచ్చాయి. ఆ నాటి భారత్‌-వెస్టిండీస్‌ టైటిల్‌ ఫైట్‌ను నేను కళ్లారా చూశాను. ఇండియా విక్టరీ ఘడియలను బీబీసీ రేడియోలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ద్వారా విని ఉబ్బితబ్బిబ్బయ్యాను. ఒక్కో విండీస్‌ వికెట్‌ నేలకూలుతుంటే- నేను ఉద్వేగంతో కేరింతలు కొట్టాను. నాకోసం నా తండ్రి కూడా మేల్కొన్నారు. నన్ను ఉత్సాహపరిచారు. ఆ రోజు లార్డ్స్‌ మైదానం ఇండియా ఫ్యాన్స్‌తో నిండిపోయింది. ఇండియాలోనూ అందరూ ఇళ్లలోనే సంబరాలు చేసుకున్నారు.

Saturday, March 19, 2011

POLITICS & MONEY





ఏ ముహుర్తంలో ఈ దేశానికి ఫ్రీడం వచ్చిందో గాని, అంతా అవినీతిమయం అయిపోయింది. అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతున్నాయి. ఒకప్పుడు పనిచేస్తేనే లంచం తీసుకునేవాళ్లు. ఇపుడు పనిచేయకపోయినా... డబ్బులు దండుకుంటున్నారు. స్కీముల పేరు చెప్పి- దొరికినకాడికి దోచుకుంటున్నారు. అడిగే నాథుడే లేడు. ఎందుకంటే- అందరి నోళ్లు డబ్బు మూయిస్తోంది కాబట్టి.


వికీ లీక్స్‌ తీగల దుమారం రెండురోజులుగా పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ అవకాశాన్ని తమకు అనుకూలం చేసుకోవాలని పాపం కమలనాథులు విఫలయత్నం చేస్తున్నారు. వారు అధికారంలో ఉండగా ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఏ పార్టీని, ఏ నాయకున్ని నమ్మే రోజులు కావు ఇవి.


తమిళనాడులో ఎన్నికలకు ముందే అవినీతి కంపు కొడుతోంది. కోట్లాది రూపాయలు పంచిపెడుతున్నారు. నానారకాల స్కీములు ప్రవేశపెట్టి- ఓటర్లను మభ్యపెడుతున్నారు. ఇది ఒకందుకు మంచిదే. ఇన్నాళ్లపాటు పేదల కడుపుకొట్టి దోచుకున్న ధనం మళ్లీ పేదల చెంతకే వెళ్లడం ఒక మంచి పరిణామమే. కానీ ఇలా గెలిచిన వాళ్లు మళ్లీ జనంపై విరుచుకుపడతారు. ఖజానా లూటీ చేస్తారు. అపుడు నిలదీసే హక్కు ప్రజలకు ఉండదు.


తాజాగా, మన రాష్ట్రంలో జరిగిన MLC ఎన్నికలు- అన్ని పార్టీలలో కలకలం రేపాయి. ముఖ్యంగా KCRకు ఈ ఎన్నికలు మంచి గుణపాఠమే నేర్పాయి. ఏదో తల్చుకుంటే- ఏదో జరిగింది. ముగ్గురు ఎమ్మెల్యేలు క్రాస్‌ఓటింగ్‌ చేశారన్న వార్త కొందర్ని నిశ్చేష్టపరిచింది. అధినేతకు తెలిసే జరిగిందని కొందరు, లేదని కొందరు వాదిస్తున్నారు. మొత్తం మీద ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటుతో కేసీఆర్‌ తనపై అనుమానాలను కొంతమేరకు తగ్గించగలిగారు.

Saturday, March 5, 2011

EXAM TIME



ఇది పరీక్షల సమయం. నిజంగానే కేవలం విద్యార్థులకే కాదు- రాజకీయ నేతలకు, రాజకీయ పక్షాలకు. ఇంకా చెప్పాలంటే, కేంద్ర -రాష్త్ర ప్రభుత్వాలకు కూడా. ఎందుకంటే- పిల్లలైతే చదువుకుంటారు. పరీక్షలు రాస్తారు. కానీ రాజకీయ నాయకులకు చదువులతో పనిలేదు. వారికి తెలిసిందల్లా రాజకీయాలు చేయడమే. అవకాశం దొరికితే- విద్యార్థుల్ని సైతం పావుగా వాడుకోవడమే. వారి భావోద్వేగాలకు వందల మంది విద్యార్థులు బలపీటమెక్కారు. కానీ రాజకీయ నేతలు మాత్రం కుటిలయత్నాలు మానడం లేదు. విశ్వాసం నెలకొల్పే చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వం కూడా అలాగే ఉంది.

ఇపుడు రాష్ట్ర ప్రజలను పదో తేదీ వణికిస్తోంది. ముఖ్యంగా రాజధానిలో నివసించే వారికి ఇది ఎక్కువగా ఉంది. ఆరోజు ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దశాబ్దాలకిందట వలసవచ్చిన ఆంధ్ర సోదరులను ఈ పరిణామాలు భయాందోళన కలిగిస్తున్నాయి. వారికేం జరగదని, వారిజోలికి వెళ్లమని రాజకీయ ఐకాస స్పష్టంగా ప్రకటించాలి. అపుడే మిలియన్‌ మార్చ్‌ అర్థమంతమవుతుంది.

ఇక విద్యార్థుల విషయానికొస్తే- అంతా అయోమయం, గందరగోళం. ప్రభుత్వం పట్టుదలకు పోతే- పరిస్థితి ఏంటి? పదో తేదీ సీనియర్‌ ఇంటర్‌ ఇంగ్లీష్‌ పరీక్ష ఉంది. అది రాయడానికి లక్షలాది మంది స్టూడెంట్స్‌ ఎదురుచూస్తున్నారు. పోలీస్‌ పహారాలో పరీక్షలు రాసే పరిస్థితి రాకూడదు. రెండు పక్షాలు పట్టువిడుపులకు సిద్ధంగా ఉండాలి. పిల్లలకు ఇంటర్‌ పరీక్షలు ఎంతో కీలకం. వారి లైఫ్‌లో ఈ పరీక్షలు టర్నింగ్‌పాయింట్‌. వారిని ధైర్యంగా పరీక్షలు రాయనిద్దాం.

భవిష్యత్‌ తెలంగాణ వారికోసమే అన్నప్పడు, భవిష్యత్‌ విద్యార్థులకు ఏం నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడదాం. ప్రభుత్వం కూడా పంతానికి పోకుండా పదో తేదీన పరీక్షను వాయిదా వేస్తే- పిల్లలు, వారి తల్లిదండ్రులు కాస్త ఊపిరిపీల్చుకుంటారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కేంద్ర సర్కార్‌, కాంగ్రెస్‌ హైకమాండ్‌లు సూచనప్రాయంగా చెబుతున్నాయ్‌ కాబట్టి- హైదరాబాద్‌లో జరగబోయే పరీక్షల నిర్వహణకు అన్ని రాజకీయ పక్షాలు అనుకూల వాతావరణాన్ని కల్పించాలి.